పట్టణాలంటే మురికి కూపాలుగా కాకుండా ప్రగతికి కేంద్రాలుగా ఉండాలని ముఖ్యమంత్రి కేసిఆర్ ఆలోచారు. దీనిలో భాగంగానే పట్టణ ప్రగతి కార్యక్రమం సమస్యలు పరిష్కారం అవుతున్నాయని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. ఈ రోజు పట్టణ ప్రగతిలో భాగంగా వరంగల్ అర్భన్ జిల్లా వరంగల్ తూర్పు నియోజక వర్గంలో ఆమె పలు వార్డుల్లో పర్యటించారు. అక్కడి స్థానిక సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వాటిని పరిష్కరించాలని అధికారులను ఆదేశాలు జారీ చేశారు. మంత్రితో పాటు స్థానిక ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్, వార్డు నేతలున్నారు. పట్టణాల్లో ప్రధానంగా ఇండ్ల సమస్య ఉంది. దీని శాశ్వత పరిష్కారం కోసం దశల వారిగా ముఖ్యమంత్రి కేసీఆర్ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను నిర్మిస్తున్నారన్నారు. పేదవాళ్లు కూడా ఆత్మగౌరవంతో నివసించాలన్న గొప్ప లక్ష్యంతో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను నిర్మిస్తున్నాం. వరంగల్ జిల్లాలో కూడా అర్హులందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు వచ్చేలా కృషి చేస్తామన్నారు.
రాజీవ్ గృహ కల్ప ద్వారా ఇండ్లు ఇచ్చినా సకాలంలో పూర్తి కాలేదు. వాటిని పూర్తి చేసేందుకు సీఎం కేసీఆర్ ఇప్పటికే ఆదేశాలిచ్చారన్నారు. ఇక్కడ 734 కుటుంబాలు నేడు ఈ రాజీవ్ గృహకల్పలో నివాసం ఉండేందుకు అవకాశం ఉన్నంది. ఇందులో మౌలిక సౌకర్యాల కల్పనకు 10. 34 లక్షల రూపాయలు సిఎం కేసిఆర్ కేటాయించి, వీటిని పూర్తి చేయాలని చెప్పారన్నారు. నిజమైన లబ్దిదారులను గుర్తించి ఈ రాజీవ్ గృహ కల్ప ఇండ్లను పంపిణీచేయాలని అధికారులను ఆదేశించామని పేర్కొన్నారు.